వచ్చే ఎన్నికల్లో తొలి విజయం దక్కించుకోవడం కోసం చాలామంది నేతల వారసులు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా టిడిపిలోని వారసులు. గత ఎన్నికల్లో పలువురు నేతల వారసులు పోటీ చేశారు గాని ఒక్కరూ కూడా గెలవలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో టిడిపి నేతలు వారసులు పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో దివంగత బాలయోగి వారసుడు హరీష్ సైతం తొలి విజయం కోసం వేచి చూస్తున్నారు. గత ఎన్నికల్లో హరీష్..అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
కేవలం 40 వేల ఓట్ల మెజారిటీతో హరీష్..అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అమలాపురంలో జనసేనకు దాదాపు రెండున్నర లక్షల ఓట్లు పడ్డాయి. అంటే అక్కడ జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దాని వల్ల హరీష్ ఓటమి పాలయ్యారు. ఇక ఈ సారి హరీష్ ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు. కాకపోతే మొన్నటివరకు అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గా ఉన్న హరీష్ని ఈ మధ్య పి.గన్నవరం అసెంబ్లీ ఇంచార్జ్ గా పెట్టారు.
దీంతో ఈ సారి ఎన్నికల్లో హరీష్కు పి.గన్నవరం సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఉన్నారు. కానీ ఆయన పనితీరు పెద్దగా బాగోలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో మళ్ళీ చిట్టిబాబుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక ఇటు టిడిపి బలపడుతుంది. ఒకవేళ హరీష్ నిలబడితే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
కాకపోతే పక్కగా గెలవాలంటే జనసేన మద్ధతు కావాలనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ జనసేనకు కాస్త ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో 36 వేల ఓట్లు వరకు పడ్డాయి. టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీ 22 వేలు అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలిచే ఛాన్స్ లేదు. ఇక హరీష్ గెలవాలంటే జనసేన మద్ధతు కావాల్సి వస్తుంది. చూడాలి మరి టిడిపి-జనసేన పొత్తు ఉంటుందో లేదో..!