బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ రెండూ నిరాశ పరిచాయి. సాహో కనీసం బాలీవుడ్లో బాగా ఆడింది. రాధేశ్యామ్ ఓవరాల్గా డిజాస్టర్. ఇక తెలుగులో సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు బాగా నిరాశ పరిచాయి. ఈ సినిమాలు కొన్నవాళ్లు కూడా కోట్లలో నష్టపోయారు. ఇది ప్రభాస్ ఇమేజ్ను ఎంతైనా డ్యామేజ్ చేసింది.
ఈ టైంలో రాధేశ్యామ్ తర్వాత రెండేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేసిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది. ఇంత భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమాకు నైజాంలో పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు. గత కొంత కాలంగా నైజాంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూస్తున్నాం.
దీనికి అంతటికి ప్రధాన సమస్య ఇక్కడ డిస్ట్రిబ్యూషన్, థియేటర్లను గుప్పెట్లో పెట్టుకున్న వారి వల్లే..! మొన్న సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య విడుదల టైమ్లో ఇదే సమస్య. ఇప్పుడు ఆదిపురుష్కు ఇదే సమస్య వస్తోంది. ఆదిపురుష్ సినిమాకు సడెన్గా రెంట్లు పెంచేస్తున్నారట. దీనికి తోడు అడ్వాన్స్లు కూడా అనుకున్నట్టుగా రావడం లేదంటున్నారు.
ఆదిపురుష్ సినిమాను నైజాం ఏరియాకు 50 కోట్ల నాన్ రిటర్నబుల్, 10 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ మీద మైత్రీ వాళ్లు కొన్నారు. ఈ సినిమాకు పెద్ద ఎగ్జిబిటర్ల నుంచి సహాయనిరాకరణ ఎదురవుతోంది. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాకు కనీసం సంక్రాంతి టైంలో ఉన్న సినిమాలకు ఇచ్చిన అడ్వాన్స్లు కూడా ఇవ్వడం లేదట.
అసలే థియేటర్లకు సినిమాలు లేవు. ఇలాంటి టైంలో పెద్ద సినిమా వస్తుంటే థియేటర్లు ఇవ్వాల్సింది పోయి.. అడ్వాన్స్లు ఇవ్వలేము.. రెంట్ ఎక్కువ కావాలన్న డిమాండ్లు పెట్టడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నైజాంలో ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇప్పుడు అన్ని వైపులా నుంచి ఆదిపురుష్ బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇది అంతిమంగా సినిమా వసూళ్లపై ప్రభావం చూపనుంది.