దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో అదే కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని.. అయితే ఆయన అరెస్టు అయినా బెయిల్ పై వస్తారని చెప్పారు. అవినాష్ను ఈ కేసులో అనవసరంగా ఇరికించారని ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. నిన్న ఎంపీ అవినాష్ కడపలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా – ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వచ్చారు.
తనను ఈ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేస్తే నెక్ట్స్ ఎలా ? ముందుకు వెళ్లాలనేదానిపై వీరు చర్చించారు. సమావేశం అనంతరం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవినాష్ ఈ కేసులో అరెస్టు అయినా బెయిల్పై బయటకు వస్తారని అనడం గమనార్హం.
ఈ కేసులో చంద్రబాబు వెనకుండి కుట్ర చేసి అవినాష్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సంబంధం లేని మాటలు మాట్లాడారు. ఇక వైసీపీ ఎంపీ అవినాష్ అరెస్టు తప్పదని వైసీపీ ఎమ్మెల్యేయే స్వయంగా వ్యాఖ్యలు చేయడం.. ఇప్పపుడు అధికార పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.