సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. తాజాగా ఒక నటుడు, దర్శకుడు మృతి చెందడంతో సినిమా రంగానికి మరో పెద్ద షాక్ తగిలినట్లు అయింది. శాండల్ వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య మృతి చెందారు. కిడ్నీ ఫెయిల్యూర్ తో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన కొలుకోలేక తుది శ్వాస విడిచారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సత్య మృతి చెందిన విషయం తెలియడంతో శాండల్వుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆ కుటుంబానికి ఆధారమైన సత్య మృతి తీరని శోకం మిగిల్చింది. సత్య తల్లి మాట్లాడుతూ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు… ఎప్పుడు సినిమాలకే అంకితం అయ్యేవాడు.. నన్ను నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్యం మాటిచ్చాడు.. సత్య మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యామంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
సత్య భౌతికాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. యోగేష్, నందిత జంటగా నటించిన నందా లవ్ సినిమాలో సత్య విలన్గా నటించారు. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మేళా సినిమాను డైరెక్ట్ చేశారు.
ఇప్పుడు మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతలోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మృతితో కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ కన్నడ నటుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.