23 ఈ అంకెకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడిపికి చాలా లింక్ ఉంది. ఈ 23 అంకె చూపించి వైసిపి ఎప్పటికప్పుడు టీడిపిని ఎద్దేవా చేస్తూ వస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నికలలో విజయం సాధించిన టీడిపి వైసిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికలలో టీడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఆ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో వైసిపి నేతలు గత నాలుగు సంవత్సరాలుగా ఈ 23 అంకె చూపించి టీడిపిని ఎద్దేవా చేసేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు అదే 23 వైసీపీకి పెద్ద శాపంగా మారింది. అదే 23 టీడిపికి లక్కీగా నిలిచింది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టీడిపి, వైసిపి నుంచి పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థుల కంటే ఎక్కువగా 23 ఓట్లు దక్కించుకొని భారీ విజయం నమోదు చేసింది.
వాస్తవానికి టీడిపి అభ్యర్థి విజయం సాధించాలి అంటే 22 ఓట్లు చాలు. అయినా మరో ఓటు టీడిపి అదనంగా తన ఖాతాలో వేసుకుంది. ఇలా 23 టీడిపికి లక్కీగా మారింది మరో గమ్మత్తు అయిన విషయం ఏంటంటే టీడిపి గత సాధారణ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మే 23న కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు టీడిపి గెలిచినప్పుడు మార్చి 23న ఫలితం వచ్చింది.
అలాగే మార్చి నెల నెంబర్ 3 కాగా… 20 23వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. అలా మొత్తంగా టీడిపి తనకు శాపంగా మారిన 23 చుట్టూ రాజకీయం చేసి వైసిపికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏ 23 వైసిపి తనకు లక్కీ నెంబర్ అనుకుందో.. ఇప్పుడు అదే 23 ఆ పార్టీకి పెద్ద శాపంగా మారింది అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.