చంద్రబాబును రాజకీయంగా అపర చాణిక్యుడు అని పిలుస్తూ ఉంటారు. గత సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన పని అయిపోయిందని.. ఇక ఆయనకు రాజకీయ సన్యాసమే మిగిలి ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన పొందిన వ్యూహాలతో ఆయన ప్రత్యర్థులకే కాదు.. రాజకీయ వర్గాలకు సైతం దిమ్మ తిరిగిపోయినట్టుగా ఉంది. అసలు ఈ ఎన్నికలలో టీడిపి అభ్యర్థి గెలిచేందుకు సరైన సంఖ్యాబలం కూడా లేదు.
అలాంటి టైంలో బీసీ మహిళ అయిన విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను రంగంలోకి దింపారు. బాబు ఊహించినట్టుగానే ఆమె సంచలన విజయం సాధించడంతోపాటు వైసిపి అభ్యర్థుల కంటే ఎక్కువగా 23 ఓట్లు సాధించారు. వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చంద్రబాబు భావించగా అదే నిజం అయింది. వరస విజయాలతో తనకు తిరుగులేదని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం పెద్ద చెంపపెట్టుగా భావించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రబాబు బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ తరపున గెలిపించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2007లో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మండలిని పునః ప్రారంభించారు. అప్పుడు టీడిపికి నాలుగు ఎమ్మెల్సీలు గెలుచుకునే సంఖ్యాబలం మాత్రమే ఉంది. అయితే నాడు కాంగ్రెస్ లో ఉన్న లుకలుకలు గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా టీడిపి నుంచి ఐదో అభ్యర్థిని కూడా పోటీలో పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడిపి అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరగడంతో టీడిపి ఐదో స్థానం కూడా గెలుచుకుంది.
అప్పట్లో ఇది ఒక సంచలనం. నేడు జగన్ కు కూడా చంద్రబాబు తన చాణక్యంతో పెద్ద షాక్ ఇచ్చారు. టీడిపి గెలిచేందుకు సరైన సంఖ్యాబలం లేకపోయినా వైసిపి నుంచి ఓట్లు క్రాస్ అవుతాయని అభ్యర్థిని రంగంలో ఉంచారు. చివరకు చంద్రబాబు అంచనా నిజం అయింది. ఏకంగా నాలుగు ఓట్లు క్రాస్ అవ్వడంతో టీడిపి సంచలన విజయం సాధించింది. రాజకీయ చతురతతో 2007లో తండ్రి వైఎస్ఆర్ కు షాక్ ఇచ్చిన చంద్రబాబు నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద షాకే ఇచ్చినట్లయింది.