ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసిపికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద షాక్ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా టీడిపి అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో వైసిపి నుంచి బరిలో ఉన్న కోలా గురువులు ఓడిపోయారు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. 2024 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపికి వరుసగా చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి.
వారం రోజుల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముడుచోట్ల టీడిపి క్లీన్ స్వీప్ చేసింది. వైసిపి అభ్యర్థులు మూడు నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ టీడిపికి ఓటు వేయటం వైసిపి వర్గాలకు అస్సలు మింగుడు పడటం లేదు. ఇదిలా ఉంటే టీడిపికి క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేపై వైసిపి వర్గాలు ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
సదరు ఎమ్మెల్యే తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని.. ఇప్పటికే చాలాసార్లు ఖండిస్తున్నా ఆమెని చాలామంది అనుమానిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మరో ఎమ్మెల్యే పై సైతం వైసిపి గట్టి నిఘా పెట్టిందని తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే కూడా పార్టీలో.. పదవుల్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని కొద్ది రోజులుగా రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో సదరు ఎమ్మెల్యేకు కూడా ఎమ్మెల్యే సీటు వస్తుందా ? రాదా అన్న సందేహాలు ఉన్నాయి.ఒకప్పుడు పార్టీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు జగన్ కు బాగా దూరం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. చివరకు తన కుటుంబ సభ్యుల ట్రాన్స్ఫర్ విషయంలోనూ సదరు ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికలకు ముందు సదరు ఎమ్మెల్యే కూడా ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అని పార్టీ వర్గాల్లోనే చాలా సందేహాలు ఉన్నాయి.