సినీ నటుడు మంచు మనోజ్ త్వరలోనే రాజకీయ రంగం చేయబోతున్నారా ? రాజకీయాల్లోకి రావాలని ప్రజాసేవ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న మనోజ్ కు ఇదే సరైన సమయం అవుతోందా ? అంటే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలలో దీనిపై అవును అన్న చర్చలే నడుస్తున్నాయి. మంచు ఫ్యామిలీకి టిడిపి అధినేత చంద్రబాబుకు బంధుత్వం ఉంది. మోహన్ బాబుకు చంద్రబాబు వరుసకు మేనత్త కొడుకు అవుతాడు. ఇక మనోజ్ రీసెంట్గా దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం మనోజ్ తన భార్య మౌనికతో కలిసి చంద్రబాబును కలిశారు.
ఆ మాటకు వస్తే మంచి ఫ్యామిలీకి వైయస్సార్ కుటుంబానికి కూడా బంధుత్వం ఉంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న కుమార్తె వెరోనిక రెడ్డి మోహన్ బాబు పెద్ద కోడలు అన్నది తెలిసిందే. గత ఎన్నికలకు ముందు విష్ణుతో కలిసి మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక తాను రాజకీయాలకు రాను అని దండం కూడా పెట్టేశారు. ఇక మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్నాక చంద్రబాబును కలవడం ఆసక్తిగా మారింది.
ఇక భూమా ఫ్యామిలీ విషయానికి వస్తే మౌనిక అక్క అఖిల మాజీ మంత్రిగా పనిచేయడంతో పాటు గత ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో ఆమెకు ఆళ్లగడ్డ సీటు వస్తుందా రాదా అన్న సందేహాలు ఉన్నాయి. ఆళ్లగడ్డ సీటు అఖిలకు ఇవ్వటం అక్కడ టిడిపి కేడర్ కు ఇష్టం లేదు. ముఖ్యంగా మరో టిడిపి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు పొసగటం లేదు. ఒకవేళ మౌనిక ఎన్నికల బరిలోకి దిగితే ఆమెకు సుబ్బారెడ్డితో పాటు ఆళ్లగడ్డ టిడిపి క్యాడర్ భూమా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారని.. ఇటు మంచు ఫ్యామిలీ అండదండలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే మౌనిక, మనోజ్ టిడిపి కండువా కప్పుకుంటే ఆళ్లగడ్డ టిడిపి టికెట్ రేసులో మౌనిక ఉంటుందని గుసగుసలు అయితే నడుస్తున్నాయి. ఒకవేళ మనోజ్ పోటీ చేయాలి అనుకుంటే సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. కచ్చితంగా మనోజ్ కు సీటు వస్తుందా రాదా ? అన్నది పక్కన పెడితే వీరు టిడిపిలోకి వస్తే రాజకీయ సమీకరణలు ఎప్పుడు ఎలా అయినా మారే అవకాశాలు ఉన్నాయి.