అన్నగారు ఎన్టీఆర్.. గతంలో పార్టీ ఆవిర్భావ సమయంలో ఊరూరా నిర్వహించిన సమావేశాలు, సభలకు ప్రజలు పోటెత్తేవారు. ఎక్కడెక్కడి నుంచో బళ్లు కట్టుకుని.. భోజనాలు తెచ్చుకుని మరీ అన్నగారి మాట వినేందుకు.. అన్నగారిని చూసేందుకు ప్రజలు పరుగులు పెట్టేవారు. అచ్చంగా అలాంటి సిట్యుయేషనే తాజాగా అద్దంకిలో కనిపించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ యువ నాయకుడు నారాలోకేష్.. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యాత్ర అద్దంకిలో సాగింది.
ఈ సందర్భంగా ఆయన చేసిన పాదయాత్రలో పాల్గొనేందుకు అద్దంకి అద్దంకే తరలి వచ్చిందా అన్నట్టుగా ప్రజలు తరలి వచ్చారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ను మూడు గంటల పాటు నిలిపివేయడం గమనార్హం. ముఖ్యంగా అద్దంకి యువగళం పాదయాత్రను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కీలక పాత్ర పోషించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. పక్కా ప్లాన్తో ఆయన ముందుగానే రూట్ మ్యాప్ను అర్థం చేసుకుని.. దాని ప్రకారం పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని వెళ్లిన ఫలితంగా ప్రజలు ఈ పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వచ్చారని సీనియర్లు చెబుతున్నారు.
“నిజానికి అద్దంకిలో యువగళం పాదయాత్రకు ఈ రేంజ్లో వస్తారని అనుకోలేదు. కానీ, రోజు రోజుకు పాదయాత్రకు మరింత మంది ప్రజలు తరలివస్తున్నారు. ఇది పార్టీ విజయానికి సంకేతంగా నిలుస్తోంది“అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యా నించారు. ఇదిలావుంటే.. నారాలోకేష్కు ఎమ్మెల్యే గొట్టి పాటి రవి ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున స్వాగతం లభించింది. వివిధ కళారూపాలకు చెందిన కళాకారులు చేసిన నృత్యాలు.. పాటలు.. వంటివి యువగళానికి సరికొత్త సొబగులు అద్దాయి.
ఓవరాల్గా ఇక్కడ జనాలను చూసిన రాజకీయ విశ్లేషకులు కూడా గొట్టిపాటి బుజ్జి దమ్ము చూపి దుమ్ము లేపాడని.. జగన్ సర్కార్ పెద్దలకు ఈ జనం చూసి షేక్ అయ్యే రేంజ్లో ఇక్కడ యువగళం బ్లాక్బస్టర్ అంటున్నారు. ఇక, పాదయాత్రలో యువకులు కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతూ.. ముందుకు సాగారు. మొత్తంగా చూస్తే.. అద్దంకి యువగళం నభూతో.. అన్నట్టుగా సాగడం వెనుక ఎమ్మెల్యే గొట్టిపాటి రవి నిరంతర కృషి, పార్టీ విషయంలో ఆయన అంకిత భావం రెండూ ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.