పార్టీకి కాస్త మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్న టైంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు కొంప ముంచేస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం పార్టీకి కంచుకోట. పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్టీ నియోజకవర్గాలలో పార్టీ ఓడిపోయిపా కూడా పోలవరంలో తెలుగుదేశం గెలిచింది అంటే ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. పైగా ఈ నియోజకవర్గంలో టీ నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటిది.
పార్టీ ఆవిర్భవించాక ఒకటి రెండు సందర్భాలలో మినహా అన్ని ఎన్నికలలోను టీ నర్సాపురం మండలంలో తెలుగుదేశం తన ఆధిక్యత చాటుకుంది. అలాంటి మండలంలో ఒక సీనియర్ నేత గ్రూపులు కట్టి పార్టీని నిలువునా ముంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేత ఎవరో కాదు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు. శీలంది ముందు నుంచి అహంకార ధోరణి అన్న విమర్శలు ఉన్నాయి.
2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు శీలం ఎంపీపీ అయ్యారు. ఐదేళ్లపాటు శీలం నియోజకవర్గంలో గ్రూపులు కట్టడంతో పార్టీ ఘోరంగా నష్టపోయింది. చివరకు శీలం తీరువల్ల అప్పటి ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు మధ్య కూడా సఖ్యత కరువైంది. దీనికి కేవలం శీలం చేసిన గ్రూపు రాజకీయాలే అని టిడిపి నేతలు బహిరంగ విమర్శలు చేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో గ్రూపుల వల్లే మండలంలో పార్టీ బాగా నష్టపోయింది.
ఇక ఎన్నికలలో పార్టీ ఓటమి తర్వాత సంస్థాగత మార్పులలో భాగంగా టిడిపి మండలంలోని బంధంచర్ల గ్రామానికి చెందిన నాయుడు రామకృష్ణారావు గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణ మండల పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనూహ్యంగా పార్టీని పటిష్టం చేశారు. మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులతో పాటు మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు.. సీనియర్లు అన్ని కులాలు.. వర్గాలను కలుపుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నాయుడు రామకృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టాక మండల పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా బలోపేతం అవుతుంది. క్షేత్రస్థాయిలోనూ అన్ని గ్రామాల్లో పార్టీ రోజురోజుకు బలపడుతోంది.
ఆయన పని తీరు పట్ల నియోజకవర్గ పార్టీ నేతలు, అటు జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా హ్యాపీగా ఉంది. అయితే తాజా పరిణామాలతో పార్టీకి చేటు జరిగేలా ఉంది. ఇటీవల మండలంలోని తిరుమలదేవిపేటలో పార్టీలో కొన్ని చేరికలు జరిగాయి. కనీసం మండల పార్టీ అధ్యక్షుడికి, మండల పార్టీకి చెప్పకుండానే శీలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పైగా దీనికి మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ కూడా అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ అంతా గ్రూపు రాజకీయాల పితామహుడు
శీలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోనే జరిగింది.
ఇదే గ్రామం నుంచి పలువురు బీసీ నేతలు, ఇతర పార్టీల నాయకులు నాయుడు రామకృష్ణారావు మీద నాయకత్వంతో పార్టీలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపారు బీసీలు పలువురు.. ఆయన పద్ధతిగా స్థానిక గ్రామపార్టీ అధ్యక్షుడిగా కూడా చెప్పి వారిని పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆయనకు, మండల పార్టీకి ఎక్కడ మైలేజ్ వెళుతుందన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు మండల పార్టీకి సంబంధం లేకుండా ఈ ప్రోగ్రామ్ చేసేశారు.
కేవలం తమ ఉనికి పోతుందన్న భయంతోనే ఈ గ్యాంగ్ ఈ ప్రోగ్రామ్ చేసినట్టుగా ఉంది. అప్పటకీ జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మండల పార్టీతో సమన్వయం చేసుకుని వెళ్లాలని నియోజకవర్గ ఇన్చార్జ్ బొరగం శ్రీనుకు సూచించినా కూడా ఆయన కూడా పెడచెవిన పెట్టారని తెలిసింది. ఎంత కామెడీ అంటే వీరు ఆ గ్రామంలో టీడీపీ కండువాలు కప్పిన రోజే ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. అసలు ఇలాంటి నాయకత్వం వల్ల, ఇలాంటి చేరికల వల్ల పార్టీకి ఎంత ఉపయోగమో అర్థం చేసుకోవాలి.
ఏదేమైనా గతంలో ఇదే శీలం గ్రూపు రాజకీయాలు చేయడంతో అప్పటి ఎమ్మెల్యే మొడియం శ్రీనుకు చివర్లో సీటే రాలేదు. ఇప్పుడు బొరగం కూడా గత ఎన్నికల్లో ఓడిన సానుభూతితో గెలుపు వైపు వెళుతోన్న దశలో ఇలాంటి రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ తనకు తానే పొగ పెట్టుకుంటున్నట్టుగా ఉంది. ఇక పోలవరం పార్టీ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు అబ్జర్వర్ నేతలను సమన్వయం చేయలేక గ్రూపుల గోలకు మరింత ఆజ్యం పోస్తున్నాడు.