పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా ట్రయిలర్ లాంఛ్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్కు మేకర్స్ 2 వేదికలు ఎంపిక చేశారు. అంటే ఒకేసారి ఒకే టైంలో ఈ రెండు చోట్లా ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఇందుకు మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సిటీలను ఎంచుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా తెలిపారు.
ఏపీలో విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ లో ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. ఇక్కడ జరిగే ఈవెంట్ కు హీరో సాయిధరమ్ తేజ్ వస్తున్నాడు. అతడితో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా వైజాగ్ ఈవెంట్లో పాల్గొంటారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ లోని దేవీ 70ఎంఎం థియేటర్ మరో వేదికగా ఫిక్స్ అయ్యింది. ఇక్కడ జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దర్శకుడు సముద్రఖని, హీరోయిన్ కేతిక శర్మ, సంగీత దర్శకుడు తమన్ వస్తున్నారను.
ఇలా ఒకేసారి రెండు ఈవెంట్స్ చేసి గ్రాండ్ గా బ్రో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా మేకర్స్. ఇలా ఓ పెద్ద హీరో సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఫంక్షన్ చేస్తూ ఇలా రిలీజ్ చేయడం టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇక పవన్ షరా మామూలుగానే తన సినిమా ప్రమోషన్ కు హాజరవ్వడం లేదు. పవన్ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.
ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కోలీవుడ్లో వచ్చిన వినోదయ శితం సినిమాకు రీమేక్ ఇది. ఇందులో పాయింట్ మాత్రమే తీసుకొని, పూర్తిగా కొత్త సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మార్పుచేర్పులు చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతోంది.