లోకేష్ ‘ యువ‌గ‌ళం ‘ పై వైసీపీ నిఘా.. ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తుందో చూడండి..!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్రపై అధ‌కార పార్టీ వైసీపీ నిఘా పెట్టిందా? యువ‌గ‌ళంలో ఏం జ‌రుగుతోంది? తెర‌చాటున ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు? వంటి కీల‌క అంశాల‌పై డేగ‌క‌న్ను సారించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 156 రోజులుగా సాగుతోంది.

అదేస‌మ‌యంలో కీల‌కమైన సీమ ప్రాంతం దాటుకుని, నెల్లూరులో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ఉమ్మడి ప్రకాశంలో జ‌రుగుతోంది. అయితే.. సీమ‌లో వైసీపీకి బ‌లంఉన్న నేప‌థ్యంలో యువ‌గ‌ళాన్ని అధికార పార్టీ నాయ‌కులు లైట్ తీసుకున్నారు. కానీ, నెల్లూరులోకి వ‌చ్చేస‌రికి అనూహ్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఇక, ఇక్క‌డ నుంచి ఉమ్మ‌డి ప్రకాశంలోని కందుకూరు, కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గాల్లోకి పాద‌యాత్ర వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. అనూహ్యంగా ప్ర‌కాశం జిల్లాకు వ‌చ్చేస‌రికి మాత్రం అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న దాష్టీకాలు అంటూ.. టీడీపీ నాయ‌కులు ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి టీడీపీకి సంబంధం లేద‌ని.. అస‌లు వీరు మ‌న రాష్ట్ర వ్య‌క్తులు కూడా కాద‌ని గుర్తించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌కు చెందిన యువ‌కులుగా తెలుసుకున్నారు. అంతేకాదు.. ఈ ఇద్ద‌రు యువ‌కులు కూడా తాము తెలంగాణ కు చెందిన వార‌మ‌ని భావించేలా వ్య‌వ‌హ‌రించారు.

క‌ట్ చేస్తే.. టీడీపీ నాయ‌కులు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. త‌మ‌ను కావాలని ఇర‌కాటంలోకి నెట్టేందుకు వైసీపీ ఇలా చేస్తోంద‌ని.. అంటున్నారు. ప‌ట్టుబ‌డిన ఇద్ద‌రు యువ‌కులు కూడా.. వైసీపీ స‌ర్వేసంస్థ ఐప్యాక్ బృంద స‌భ్యులేన‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. త‌మ‌పై నిఘా పెట్టిన మాట వాస్త‌వ‌మ‌ని..అయితే, తాము ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేక పోయామ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై వైసీపీ నిఘా వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.