టాలీవుడ్లో ఇప్పుడు అంతా మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటించేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. సినిమాలో ఏ హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గిపోతుందో ? ఏ హీరో అభిమానులు ఎక్కడ ఫీలవుతారో అన్న డౌట్లు వాళ్లకు ఉండేవి. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో నందమూరి, కొణిదెల కాంపౌండ్లకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి అదికూడా ఓ పాన్ ఇండియా సినిమాలో నటించడం అంటేనే పెద్ద సెన్షేషనల్ అయిపోయింది.
అలాంటిది 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి, యంగ్టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా అనుకున్నారట. అప్పట్లోనే ఈ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నం జరిగింది. ఇది నిజంగా సెట్ చేసి ఉంటే పెద్ద సెన్షేషనల్ అయిపోయేది. నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్గా ఉండే ఆవుల గిరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
నైజాంలో గిరి అంటే ఒకప్పుడు టాప్ డిస్ట్రిబ్యూటర్. ఆయన స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు అక్కడ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన చిరు – ఎన్టీఆర్ కాంబోలో సినిమా అనుకున్నారు. కొన్ని కథలు కూడా విన్నారు.. చాలా మంది దర్శకులను పిలిపించి ప్రత్యేకంగా సిట్టింగులు కూడా వేశారు.
అప్పట్లో ఎన్టీఆర్ ఆది, సింహాద్రి సినిమాలతో తిరుగులేని మాస్ ఇమేజ్తో ఒక్కసారిగా దూసుకు వచ్చారు. అయితే వీరి ఇమేజ్లను ఈక్వల్గా బ్యాలెన్స్ చేసే కథలు దొరక్కపోవడం.. కథలు దొరికితే డైరెక్టర్లు వీరిని డైరెక్ట్ చేసే డేర్ చేయలేకోవడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత చిరు తనయుడు చెర్రీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ సినిమా రావడం విశేషం.