టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరో సినిమాలు ఒకే రోజున విడుదలవడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల చేస్తున్నారంటే వారి ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. ఇలా ఒకే సందర్భంలో సినిమా విడుదలవడం చాలా రేర్ సందర్భాల్లో జరుగుతుంది. ఇక టాలీవుడ్లో ఆప్యాయంగా బావా.. బావా అని పిలుచుకుంటూ ఉండే పాన్ ఇండియా స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ల సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వేదికగా విడుదల కానున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ఈ రెండు సినిమాలు ఒకేసారి వచ్చే ఏప్రిల్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులైనా ఏవో కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. ముందు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేద్దాం అనుకున్నారట మూవీ టీం.
ప్రస్తుతం అది జరిగేలా లేదు. దీంతో ఏప్రిల్ నెలలోనే పుష్ప 2 సినిమాను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో సీక్వెల్ పుష్ప 2 సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ మాత్రం బ్రేక్ లేకుండా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట కొరటాల.
దీంతో దేవర సినిమా పైన కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఎలాగైనా దేవర సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు కొరటాల. ఇక ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్లో ఎవరు ? పై చేయి సాధిస్తారు అనే కోణంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.