`నాన్నగారు.. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రేక్షకులకు అంత ఓపిక లేదు. మూడు గంటల సినిమా ఎవరు చూస్తారు“-“నాన్నగారు.. పౌరాణికాలపై ప్రేక్షకులకు ఆసక్తి పోయింది. ఇక, చాలు ఆపేయండి!“- ఇవీ.. అన్నగారు ఎన్టీఆర్కు ఆయన కుమారులు, కుమార్తెలు కూడా చెప్పిన మాట. అది దానవీరశూరకర్ణ సినిమా తీస్తున్న సమయం. రామకృష్ణ సినీ స్టూడియోలోనే అన్నగారు.. ఉండేవారు. ఈ సినిమాపై అనేక అంచనాలు పెట్టుకున్నారు.
సినిమా సగంలో మంచి పీక్ సమయంలో ఉంది. ఒకవైపు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది నటులు ఈ సినిమాలోనటించేందుకు ముందుకు రాలేదు. ముఖ్యంగా అక్కినేని, శోభన్బాబు వంటి వారు కూడా పౌరాణికాలపై ఆసక్తి లేదంటూ.. తప్పుకొన్న సమయం. అయినా.. అన్నగారు పట్టుబట్టి చేసిన సినిమా ఇది. అయితే.. అప్పట్లో బ్యాంకు ఖాతాలో అన్నగారికి ఉన్న సొమ్ము 15 లక్షలు. దీనిలో 10 లక్షల బడ్జెట్ను ఈ సినిమాకు కేటాయించారు.
ఈ ఖర్చు భాధ్యతలను అన్నగారి మూడో కుమార్తె ఉమామహేశ్వరికి అప్పగించారు. అప్పట్లో సినిమా ప్రోస్టు ప్రొడక్షన్లో పలువురు అన్నగారి బంధువులే పనిచేశారు. అయితే.. పది లక్షలు అనుకున్న బడ్జెట్ దాటిపోతోందని ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంతే.. అందరూ వచ్చి అన్నగారిపై పడ్డారు. ఈ సినిమాను ఎవరు చూస్తారు? అని హరికృష్ణ చనువు కొద్దీ.. అనేశారు. ఇక, బాలకృష్ణ కూడా.. రోజులు మారాయి.. అని ముక్తాయించారు.
మొత్తానికి కుటుంబం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా.. అన్నగారు ఎవరూ చూడకపో తే.. ఫ్రీగా చూపిస్తా! అని తేల్చేశారు. ఇక, ఖర్చు విషయానికి వస్తే… 10 లక్షలు దాటకుండా చూస్తానని చెప్పా కదా.. దానికే కట్టుబడతా! అని తేల్చి చెప్పారు. మొత్తానికి ఎవరి సహకారం లేకపోయినా.. సినిమా వచ్చేసింది. 3 గంటల 12 నిమిషాల సినిమా. ఆడుతుందనే ఆశలు లేవు. తొలిరోజు కలెక్షన్లు రాలేదు.
వారం గడిచింది. ఇక, సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతే.. ఏకంగా కోటి రూపాయలు సంపాయించుకున్నారు. రిపీట్ రన్లోనూ ఈ సినిమా 100 రోజులు ఆడింది. తర్వాత.. అన్నగారి విజయం కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోలేదు. ఈ ధీమాతోనే అన్నగారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచరిత్ర తీశారు. కానీ, ఇది పరాజయం పాలైంది.