సినిమాలలో కొన్ని కొన్ని సీన్లు ఆ సినిమాలను డామినేట్ చేస్తాయి. ఆ సీన్లు ఉంటే తప్ప.. తెరమీద రక్తి కట్టించదు. ఇలాంటి సీన్లలో మూగమనసులు సినిమాలో జమున.. అక్కినేని నాగేశ్వరరావు గుండెలపై కాలు పెట్టే సీన్ ఉంటుంది. దుక్కిపాటి మధుసూదనరావు.. ఈ షాట్ కోసం పట్టుబట్టారు. అయితే.. జమున మాత్రం ముందు మొండికేసింది. అంత పెద్ద హీరో గుండెలపై కాలు పెట్టడమా ? అంటూ.. కన్నీరు కూడా పెట్టుకుంది.
కానీ, అక్కినేని చొరవతో ఈ సీన్ చేసింది. మొత్తానికి ఆ సీన్ హిట్ అయింది. ఇక, ఇలాంటి సందర్భం.. ఇద్దరు అగ్ర హీరో హీరోయిన్ల మధ్య కూడా వచ్చింది. మల్లీశ్వరి సినిమాలో అన్నగారు రామారావు, అప్పటి అగ్రతార.. భానుమతి కలిసి నటించారు. నిజానికి అప్పటికి ఇద్దరూ కూడా మంచి ఫామ్లో నే ఉన్నారు. రామారావు కూడా పాతాళ భైరవి వంటి హిట్తో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఇక, భానుమతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
“ఇప్పుడు రామారావ్ చెంప మీద నువ్వు కొట్టాలి“ .. ఇదీ మల్లీశ్వరి సినిమాలో ఇద్దరి మధ్య తీయాలని అనుకున్న సీన్. రాజుగారి కోటలోనే ఉండిపోయిన మల్లిపై దిగులు పెట్టుకున్న నాగరాజు (రామారావు).. నిద్రాహారాలు కూడా మానేస్తాడు. మొత్తానికి ఇద్దరూ ఒక రాత్రివేళ కోటలోనే కలుసుకుంటారు. ఈ సమ యంలో ప్రేమతో కూడిన ఉక్రోషం పొంగుకొచ్చి.. ఇన్నాళ్లు ఏం చేశావ్? అంటూ.. భానుమతి నాగరాజును చెంపపై కొట్టాలి!!
ముందు ఈ సీన్ అనుకోలేదు. కానీ, ఎందుకో దర్శకుడు బీఎన్ రెడ్డి ఈ సిన్ చేయాలని అనుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమను మరింత ఎక్కువగా చూపించాలని.. భావించి ఉండొచ్చు. అయితే.. ఈ సీన్కు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఇటు రామారావు కూడా.. సున్నితంగా తిరస్కరించారు. భానుమతి అయితే.. రామారావును తెరమీద కొడితే.. ఆయన అభిమానులు నన్ను నిజంగానే కొడతారు.. వద్దులేండి బాబూ.. వద్దు (ఇంత చనువుగా ఉండేవారు) అని ఆ సీన్ను తీసేయించారు.