భానుమతి ప్రత్యకతే వేరుగా ఉండేది. ఇప్పుడు మన హీరోయిన్లు ప్రత్యేకంగా కార్వాన్ అని షూటింగ్ సమ యాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఇలాంటి ఏర్పాట్లు పెద్దగా లేవు. అయితే.. ఆర్థికంగా బలంగా ఉన్న భానుమతికి ఏసీ కారు ఉండేది. అప్పట్లో ప్రతి కారుకు.. ఏసీ ఉండేది కాదు. ఇప్పుడు కారు అంటే. ఏసీ ఇన్ బిల్ట్తో వచ్చేస్తున్నాయి. కానీ, అప్పట్లో ఆప్షన్. ఖరీదు కూడా ఎక్కువ.
భానుమతి ఏసీ కారు కొన్న తొలి తరం.. హీరోయిన్. ఈ కారులోనే ఆమె రెస్ట్ తీసుకునేవారు. అయితే.. భోజనాల సమయంలో మాత్రం.. కారులో చేసేవారు కాదు. కారంతా కంపు కొడుతుంది.. అని షూటింగ్ స్పాట్లో విడిగా ప్రత్యేక టేబుల్ వేయించుకుని.. అక్కడ చేసేవారు. భానుమతి అంటే.. అందరికీ హడల్. ఆమె పెద్దగా మాట్లాడరు. ఒక వేళ మాట్లాడాల్సి వచ్చినా ఒకటి రెండు మాటలే. అది కూడా పుల్లవిరిచినట్టు ఉండేదట.
ఇక, అన్నగారితో కలిసి నటించిన మల్లీశ్వరి సినిమా సమయానికే ఆర్థికంగా భానుమతి ఎదిగారు. తర్వా త.. మహామంత్రి తిమ్మరుసు సినిమాకు వచ్చేసరికి ఆమె అగ్రదర్శకురాలు కూడా. ఈ సినిమా సమయం లోనే అన్నగారికి భానుమతికి మధ్య చిన్న వివాదం వచ్చింది.అది ఆదివారం. షూటింగ్ విరామం ప్రకటించారు. అన్నగారి కోసం.. బిర్యానీ తెప్పించారు. ఇది నాన్ వెజ్. కానీ, భానుమతి ఇంటి నుంచి లంచ్ తెప్పించుకున్నారు. ఇది వెజ్.
కానీ, ఎందుకో.. అన్నగారు బిర్యానీ వద్దని అనుకున్నారు. దీంతో భానుమతి కూర్చున్న చోటకు వెళ్లి.. రాణీ వారు(తిమ్మరుసు సినిమాలో పాత్ర) ఏం తింటున్నారో! అని అన్నారు. రాజావారు తినేది మాత్రం కాదు(నాన్వెజ్) అని భానుమతి అన్నారు. అయితే.. ఈ రోజు రాణివారు పెట్టేదే రాజుగారు తింటారు. అని రామారావు అన్నారు. అదేం కుదరదు.. నా ఒక్కదానికే తెచ్చుకున్నాను.. అని భానుమతి పెదవి విరిచారు. దీంతో అన్నగారు.. ఆ మాటెందుకు.. పెట్టనని చెబితే అడగం కదా! అనేశారట. దీంతో భానుమతి ఏమీ అనకుండా.. మరుసటి రోజు ఏకంగా.. మూడు క్యారేజీలు తెచ్చి.. పెద్ద సంతర్పణే చేశారట.