తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని కుటుంబ కథ సినిమాలు వచ్చినా ‘గుండమ్మకథ’ స్థానాన్ని మాత్రం ఏ సినిమా భర్తీ చేయలేదు. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, సూర్యకాంతం, సావిత్రి, జమున..వంటి అగ్రనటులు అందరు కలిసి నటించిన ఈ సినిమాను ఓ గోప్ప అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకు కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించగా, చక్రపాణి కథను, డివి నరసరాజు మాటలు అందించారు. ఈ సినిమా కథ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.
గుండమ్మ అత్త సూర్యకాంతం.. ఆట కట్టించడానికి అన్నయ్య ఎన్టీఆర్ పనివాడిలా గుండమ్మ ఇంట్లో చేరుతాడు.. అలాగే గుండమ్మ చిన్న కూతురు జమునకు ము క్కుతాడు వేయడానికి తమ్ముడు నాగేశ్వరరావు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని ఈ సినిమాలో వచ్చే ఒక సన్నివేశంలో.. జమున కోసం నాగేశ్వరరావు గుండమ్మ అత్త ఇంటికి వస్తాడు. ఆ సీన్ లో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ని జమున ఇక్కడ ఉంద అని అడగాలి.. ఈ సన్నివేశం కోసం రచయిత డివి నరసరాజు సంభాషణలు రాయటానికి ఎంతో ఇబ్బంది పడ్డారట.
ముందుగా నరసరాజు.. ‘ఇంట్లో నా ప్రేయసి ఉందా..? అని రాశారట’. కానీ ప్రేయసి అనే పదం బరువైనదిగా అనిపించిందట.. ‘ఆ తర్వాత ఇంట్లో నా పిట్ట ఉందా’? అనే వేరే డైలాగ్ రాశారట. పిట్టా అనే పదం చాలా మొరటగా అనిపించి అది కూడా వద్దు అనుకున్నారట. ఆ సన్నివేశానికి డైలాగ్ ఎలా రాద్దామని ఆలోచిస్తుండగా నరసరాజు గారికి ఓ గమ్మత్తైన ఆలోచన వచ్చింది. అసలు ఆ సన్నివేశానికి మాటలు లేకుండా ఇంట్లో ఆమె ఉందా? అని ఈల వేస్తూ అడిగితే బాగుంటది అనిపించింది.
నాగేశ్వరరావు ఈలలతో ఆ ప్రశ్న వేయగా ఎన్టీఆర్ కూడా ఈలలతోనే సమాధానం ఇచ్చే విధంగా రాసుకున్నారు. ఈలతో సంభాషణ కేవలం ఆ రెండు డైలాగ్స్ వరకే రచయిత రాసుకున్నారు. అయితే ఈ సినిమాకు కథ అందించిన చక్రపాణి..ఈల సంభాషణ బాగా నచ్చి.. ఆ సన్నివేశం మొత్తం కూడా విజిల్స్ తోనే రాయమని అడగడంతో నరసరాజు రాసిచ్చారట. ఇక థియేటర్ లో హీరోలు యాక్షన్స్ కి అభిమానులు ఈలలు వేస్తారు. అలాంటిది హీరోలే విజిల్స్ తో మాట్లాడితే ఇంకా ఎలా ఉంటది. సరైన డైలాగ్స్ దొరక్క విజిల్స్ తో రాసిన సీన్ థియేటర్ లో సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో మెపిస్తుంది.