బాలసుబ్రహ్మణ్యం అంటే రామోజీరావుకి అంత ఇష్టమా..? .. చివరికి ఆ పని కూడా చేసేసాడా..? ..!

దివంగత లెజెండ్రీ సింగర్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన నోటి నుంచి ఎన్నో అద్భుత పాటలు మనం విన్నాం. బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు ఎప్పుడూ మన కి ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తెలుగు ప్రజలకు బాగా దగ్గర చేసిన ఘనత రామోజీరావుది. ఆయన ఈటీవీలో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వచ్చిన పాడుతా తీయగా ప్రోగ్రాం ఎంతో పెద్ద సక్సెస్ అయింది.

అంతేకాకుండా సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రోగ్రాం కారణంగానే రామోజీరావు, బాలసుబ్రహ్మణ్యం మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది. చెన్నైలో నివాసం ఉండే బాలు.. ఈ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ కు వచ్చి వెళ్లేవారు. అయితే ఆ స‌మ‌యంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి చెన్నై వెళ్లే వరకు కూడా రామోజీ గ్రూప్ వాళ్ళ కారునే వాడే వారట. చెన్నైలో ఆయన ఫ్లైట్ ఎక్కేముందు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన కోసం ఎయిర్ పోర్ట్‌లో కారు ఉండేదట.

హైదరాబాద్‌లో ఎలాంటి పని ఉన్నప్పటికీ బాలు ఆకారులోనే వెళ్లేవారట. గతంలో ‘పాడుతా తీయగా’ సంబంధించిన ఒక బహుమతి ప్రధానోత్సవంలో రామోజీ రావు పక్కనుండగా బాలు ఈ విషయాల్ని వెల్లడించారు. ఒకసారి వ్యక్తిగత పని మీద తాను హైదరాబాద్ వచ్చానని.. ఆ సమయంలో కారు కోసం రామోజీ గారి ఆఫీసుకి ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండవలేదని.. దీంతో ధైర్యం చేసి తాను నేరుగా రామోజీ గారి ఇంటికే ఫోన్ చేశానని.. స్వయంగా ఆయనే ఫోన్ తీశారని.. కారు గురించి చెబితే ఆయన కనుక్కుని చూశారని.. ఆదివారం కావడం వల్ల డ్రైవర్లెవరూ అందుబాటులో లేరని చెప్పారని బాలు వెల్లడించారు.

ఐతే వేరే డ్రైవర్లు లేకపోయినా.. మరొకరు ఉన్నారని.. అతను కారు నడిపి చాలా కాలం అయిందని చెబుతూ ఆ వ్యక్తి పేరు ‘రామోజీ రావు’ అని వెల్లడించారని.. ఆయనలా అనగానే తాను సిగ్గు పడ్డానని, ఎక్కువ చనువు తీసుకున్నానా..? అనిపించిందని బాలు చెప్పారు. ఐతే త‌ర్వాత రామోజీ రావు పెద్ద కొడుకు కిర‌ణ్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చి త‌నను రిసీవ్ చేసుకున్న‌ట్లు బాలు వెల్ల‌డించారు.