ఎన్టీఆర్‌ను లైట్ తీస్కొన్న స్టార్ న‌టుడు… రెండు సినిమాల దెబ్బ‌కే ఇల్లు అమ్ముకున్నాడుగా..!

తెలుగు సినిమా రంగంలో పాత‌త‌రం న‌టుల‌ను ప‌రిశీలిస్తే.. చాలా మంది రూపాయి గడించారు. అయితే.. ఆ సొమ్ముతో వారు చేసిన ప్ర‌యోగాలు.. కొంద‌రికి క‌లిసి వ‌స్తే.. మ‌రికొంద‌రి విష‌యంలో విక‌టించాయి. సావిత్రి.. రామారావు.. నాగేశ్వ‌ర‌రావు, నాగ‌య్య వంటి వారికి క‌లిసి వ‌స్తే.. ర‌క్త క‌న్నీరు నాగ‌భూషణం.. స‌హా క‌త్తి కాంతారావువంటి అనేక మంది తీవ్రంగా న‌ష్ట‌పోయారు. త‌మ కు వ‌చ్చిన ఆదాయం.. కూడ‌బెట్టుకున్న సొమ్ముతో వీరు సినిమాలు తీసి.. తీవ్రంగా న‌ష్ట‌పోయారు. కొంద‌రు ఇలాంటి స‌మ‌యంలో అన్న‌గారి సూచ‌న‌లు పాటించి.. కొంత న‌ష్టంతో బ‌తుకు జీవుడా అని బ‌య‌ట ప‌డితే.. చాలా మంది అన్న‌గారి మాట‌లు వినిపించుకోకుండా క‌ష్టాలు కొని తెచ్చుకున్నారు.

ఇలాంటి వారిలో అల‌నాటి అగ్ర‌న‌టుడు ముక్కామ‌ల కృష్ణ‌మూర్తి ఒక‌రు. ఈయ‌న గుంటూరు జిల్లావాసి. నాట‌కాల నుంచి సినిమాల్లోకి 1940ల‌లోనే వెళ్లారు. స్వాతంత్రానికి పూర్వ‌మే ఆయ‌న సినిమాల్లో న‌టించారు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లు ధరించడంలో పేరు తెచ్చుకున్న ముక్కామల కృష్ణమూర్తి.. హెచ్‌.ఎమ్ మూవీస్ బ్యాన‌ర్‌పై 1951లో తీసిన‌ నిర్దోషి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. తర్వాత అన్నిరకాల పాత్రలూ చేశారు. మాయాబజార్‌, అప్పుచేసి పప్పు కూడు, ముత్యాల ముగ్గు, అవేక‌ళ్లు, దొరికితే దొంగ‌లు స‌హా అనేక పౌరాణికాల్లోనూ న‌టించి.. ముక్కామ‌ల‌గా పేరుతెచ్చుకున్నారు.

అయితే.. ఆయ‌న అన‌తి కాలంలోనే ఆర్థికంగా బాగా సంపాయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మద్రాసులోని అత్యంత ఖ‌రీదైన ప్రాంతంల పెద్ద భ‌వంతిని కోట్ల‌రూపాయ‌ల‌తో నిర్మించుకున్నారు. అయితే.. ఇది కాస్తా.. ఆయ‌న చేసిన ప్ర‌యోగాల‌తో అమ్ముకునే ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న 1957లోనే ఋష్యశృంగ అనే పౌరాణిక‌ చిత్రం తీయాలని అనుకున్నారు. ఒక నిర్మాత లభించగా ఆ చిత్రాన్ని డైరెక్టు చేశారు. దీనికి కొంత సొమ్ము పెట్టుబ‌డి కూడా పెట్టారు. ఇది ఫ‌ట్ అయింది.

ఇదిలావుంటే.. దీనికి ముందే.. హరనాథ్‌, రాజసులోచన సెకండ్‌ హీరో, సెకండ్‌ హీరోయిన్లుగా 1952లో తానే దర్శకుడు, నిర్మాత, హీరోగా ‘మరదలు పెళ్లి’ తీశారు. ఈ చిత్రం అత్యంత ఘోర‌ పరాజయం పాలైంది. క‌నీసం పెట్టుబ‌డి కూడా రాలేదు. దీంతో ముక్కామల బాగా నష్టపోయారు. ఇది అప్పుల‌కు కూడా దారి తీసింది. అప్పులు ఇచ్చిన వారు పీక‌ల‌పై కూర్చోవ‌డం.. త‌న జెల్సాలు.. వంటి కార‌ణాల‌తో ముక్కామ‌ల క‌ష్ట‌ప‌డి క‌ట్టించుకున్న అతి పెద్ద భ‌వంతిని స‌గం ధ‌ర‌కే విక్ర‌యించుకుని.. అప్పుల నుంచి బ‌య‌ట ప‌డ్డారు. కానీ… ఆయ‌న త‌ర్వాత కూడా కాలం క‌లిసి రాక‌.. ఆఫ‌ర్లు త‌గ్గాయి. ఆయ‌న‌పై బ్యాడ్ ముద్ర ప‌డిపోయింది.