డైరెక్ట‌ర్ శంక‌ర్‌పై సీనియ‌ర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్ర‌హం… త‌ప్ప‌య్యింద‌ని కాళ్ల‌మీద ప‌డ్డ శంక‌ర్‌..!

ఎస్ ఈ టైటిల్ చూసి అంద‌రూ షాక్ అవుతారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ ఏంటి.. కోలీవుడ్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఏంట‌ని.. ఎన్టీఆరే కాదు ఏఎన్నార్ కూడా క‌లిసి ఒకేసారి శంక‌ర్‌పై ఫైర్ అయ్యారు. దీంతో శంక‌ర్ ఎన్టీఆర్ కాళ్ల‌పై ప‌డిపోయాడు. అయితే మీరు అనుకున్న కోలీవుడ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వేరు… ఆ శంక‌ర్ వేరు.. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూస్తే ఆస‌క్తిక‌ర‌మే.

తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరపురాని అద్భుతమైన చిత్రాలు అందించిన దిగ్గ‌జ న‌టులు ఎన్టీఆర్ , ఏఎన్నార్. వీరిద్దరూ తమదైన నటనతో ఎన్నో జానర్ సినిమాలలో నటించారు. ఇక పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఆయన స్థాయిలో కాకపోయినా ఏఎన్ఆర్ కూడా ఎన్నో మంచి పాత్రలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ భూకైలాస్ సినిమా నిర్మించింది. ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ అధినేత మెయ్యప్పా చెట్టి ఆర్ భూకైలాస్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా రావణుడి పాత్రను పోషించారు.

ఏఎన్ఆర్ నారదుడి పాత్రలో నటించారు. భూకైలాస్ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో చాలా సీన్లు వచ్చాయి. సెట్లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని పోటీపడేవారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జమున నటించారు. ఒకరోజు సూర్యోదయ సన్నివేశం ఉంటుంది దానిని మద్రాస్ బీచ్ లో షూట్ చేయాలని దర్శకుడు కే శంకర్ అనుకున్నారు.

సూర్యోదయం సీన్‌ కావడంతో ఉదయం ఐదు గంటలకే బీచ్ కు రావాలని దర్శకుడు శంకర్ స్వయంగా చెప్పారు. దీంతో ఎన్టీఆర్. ఏఎన్ఆర్ ఇద్దరు ఓకే చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఎన్టీఆర్. ఏఎన్నార్ అక్కడకు 5 గంటలకే వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేరు. ఆరు దాటిన యూనిట్ సభ్యులను అలికిడి లేదు. దీంతో ఎన్టీఆర్. ఏఎన్నార్ కు పట్టరాని కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుండగా దర్శకుడు శంకర్ కారులో అక్కడికి వచ్చారు.

మేకప్ తో సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ ను చూడగానే దర్శకుడు శంకర్ పై ప్రాణాలు పైనే పోయినట్టు ఫీలయ్యారు. ఆయన కారులో నుంచి వణుకిపోతూ ఒక్కసారిగా వారిద్దరి కాళ్ళ మీద పడిపోయారట. పొరపాటయింది క్షమించమని బ్రతిమలాడాడట. వారిద్దరూ కాస్త కోపగించుకున్న తర్వాత శాంతించడంతో కొద్దిసేపటికి భూకైలాస్ షూటింగ్ ప్రారంభమైంది. అది అస‌లు విష‌యం.