“ఐ యామ్ ఎ కాంప్లైన్ గార్ల్, ఐ యామ్ ఎ కాంప్లైన్ బాయ్” అంటూ సాగే యాడ్ వీడియో గురించి తెలియనివారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. ఈతరానికి తెలియకపోవచ్చు గానీ, నిన్నమొన్నటి తరానికి బాగా తెలుసు. ఈ యాడ్లో ఇద్దరు చిన్నారులు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ యాడ్ టీవీలలో బాగా చక్కెర్లు కొట్టేది. ఈ యాడ్లో ఆ చిన్నారులు చాలా యాక్టివ్ గా నటించారు. ఆ తర్వాత వీరు స్టార్లుగా మారారు కూడా. అయితే ఈ విషయం అతికొద్దిమందికి తెలుసు. అందులో ఉన్న అమ్మాయి మన తెలుగులో కూడా నటించి మెప్పించింది. అలాగే ఆ పిల్లాడు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు.
ఇంతకు ఆ చిన్నారులు ఎవరో ఇప్పుడైనా అర్ధం అయిందా? అదేనండి బాలీవుడ్ రొమాంటిక్ బాయ్ షాహిద్ కపూర్ ఒకరైతే ఆ అమ్మాయి ఆయేషా టకియా. షాహిద్ కపూర్ ఇప్పటికీ బాలీవుడ్లో రాణిస్తూనే ఉన్నారు. వెండితెరపై వారు మాత్రమే కాకుండా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడపా దడపా సినిమాల్లో కనిపించిన వారు ఇపుడు పెద్ద పెద్ద స్టార్లుగా మారిన వైనాన్ని మనం చూడవచ్చు. కమల్ హాసన్ దగ్గర నుండి నేటి శ్రీలీల వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారే అని మీకు తెలుసా? అయితే వీరిలో అతికొద్ది మంది మాత్రమే ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా మారి స్టార్ స్టేటస్ను పొందగలిగారు. మరికొంతమంది మాత్రం జనజీవన స్రవంతిలో కొట్టుకుపోయారు.
కమల్ హాసన్, మీనా, శ్రీదేవి, షాలిని, తరుణ్, షామిలి, సునయన, తేజ సజ్జా ఈ కోవకే చెందుతారు. అదేవిధంగా యాడ్స్ ద్వారా మెప్పు పొందిన చిన్నారులు.. ఆ తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2003లో సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన షాహీద్.. వివాహ్ చిత్రంతో ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. తొలుత రొమాంటిక్ సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకన్న షాహిద్. ఆ తర్వాత యాక్షన్ సినిమాల వైపు దృష్టి పెట్టారు. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే మొన్న వెబ్ సిరీస్ ఫర్జీలో కూడా తన మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నారు షాహిద్.