చిల్లరకొట్టు చిట్టెమ్మ, వారాలబ్బాయ్.. వంటి అనేక చిన్నబడ్జెట్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక పేరును దక్కించుకున్న హీరో.. మురళీ మోహన్…తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్ రంగం వైపు అడుగులు వేసి.. ఆర్థికంగా బలోపేతం అయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయంగా కూడా ఎదిగారు. అయితే.. మురళీ మోహన్ కెరీర్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయన అసలు హీరోగా పరిచయం కాలేదు. కేవలం.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే సినీ ఫీల్డులోకి వచ్చారు.
తొలినాళ్లలో అన్నగారు ఎన్టీఆర్ మురళీ మోహన్ను ఎంతో ప్రోత్సహించేవారు. ఆయనను సొంత తమ్ముడి గా భావించేవారు. దీంతో మురళీ మోహన్.. క్యారెక్టర్ పాత్రల్లోఅన్నగారి సరసన నటించారు. తర్వాత శోభన్ బాబుకు బాగా చేరువయ్యారు. ఒకానొక దశలతో తన కోసం వచ్చిన దర్శకులు, నిర్మాతలకు.. శోభన్బాబే స్వయంగా మురళీ మోహన్ పేరును రిఫర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో మురళీ మోహన్.. అలా అనేక అవకాశాలు దక్కించుకున్నారు.
ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పరిచయం.. మురళీ మోహన్ కెరీర్ను యూటర్న్ తిప్పిందనే చెప్పాలి. అనేక సినిమాల్లో మురళీ మోహన్ను హీరోగా పరిచయం చేశారు. చిన్న బడ్జెట్ సినిమాల్లో మురళీ మోహన్కు ప్రత్యేక స్థానం దక్కింది కేవలం దర్శకుడు దాసరి కారణంగానేనని అంటారు. ఇక, రాఘవేంద్రరావు దర్శకత్వంలోనూమురళీ మోహన్ రెండు సినిమాలు చేశారు. తొలినాళ్ళలో అసలు డబ్బుల కోసం డిమాండ్ చేసేవారు కాదట. తర్వాత తర్వాత మాత్రం కొంత డిమాండ్ చేశారని అంటారు.