ఏపీలోనే వచ్చే సాధారణ ఎన్నికలలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం కృష్ణాజిల్లాలోని గన్నవరం. ఇక్కడ నుంచి 2014, 2019 రెండు ఎన్నికలలోను తెలుగుదేశం పార్టీ తరపున వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించారు. పార్టీ చిత్తుగా ఓడిపోయిన గత ఎన్నికలలోను వంశీ వైసిపి నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు పై 900 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. అనంతరం వంశీ టీడిపికి దూరమై వైసిపి చెంత చేరిపోయారు. వచ్చే ఎన్నికలలో ఆయన వైసిపి నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేయటం ఖరారు అయినట్టే.. ముఖ్యమంత్రి జగన్ సైతం ఆయనకు సంకేతాలు ఇచ్చేశారు. వంశీ పార్టీ మారాక చంద్రబాబు మచిలీపట్నం కు చెందిన దివంగత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గన్నవరం ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు
గన్నవరం నియోజకవర్గంలో 38వేలకు పైగా యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. వీరిలో మెజార్టీ ఓటర్లు గత ఎన్నికలలో వంశీకి జై కొట్టారు. అందుకే వంశీ పార్టీ చిత్తుగా ఓడిపోయినా… గన్నవరంలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కృష్ణా జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి టీడిపి బాగా ప్రాధాన్యత ఇస్తుంది. బచ్చుల అర్జునుడుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు గన్నవరం ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందారు. అలాగే పక్కనే ఉన్న నూజివీడులో మరో యాదవ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు ఏకంగా రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో యాదవులు క్రమక్రమంగా టీడిపి వైపు మారుతున్నారు.
ఇక వంశీకి సొంత పార్టీలోనే తీవ్రమైన అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. గత రెండు ఎన్నికలలోను వైసీపీ నుంచి వంశీపై పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వంశీకి సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. జగన్ ఎంత నచ్చచెప్పినా వీరిద్దరూ వినే పరిస్థితి లేదు. వంశీకి ఆయన చుట్టూ ఉన్న నాయకులే తప్ప.. వైసిపిలోని కీలక నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్ననేతలు, జగన్ వీరాభిమానులతో అంత సఖ్యత లేదని కూడా తెలుస్తోంది.
ఇక యాదవుల ఓటింగ్ తో పాటు వంశీ, భువనేశ్వరి, చంద్రబాబు, లోకేష్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో కమ్మ వర్గం ఓటర్లు కూడా బాగా యాంటీ అయిపోయారు. గన్నవరంలో 55 వేలకు పైగా కమ్మ ఓట్లు ఉన్నాయి. అలాగే ఇతర బీసీ వర్గాల ఓట్లు కూడా మరో 25 వేలకు పైనే ఉన్నాయి. ఈసారి వీరిలో క్రమక్రమంగా మార్పు అయితే కనిపిస్తోంది. దీనికి తోడు టీడిపికి సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు కూడా మరింత పికప్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే ఈసారి గన్నవరంలో వంశీ గట్టెక్కటం కష్టమని అక్కడ పొలిటికల్ ట్రెండ్ చెపుతోంది.