తెలంగాణలో అధికార గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే పై ఏకంగా అమ్మాయిలతో లింకులు ఉన్నట్టు వార్తలు రావటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. మరో ఐదారు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ మహిళ…ఓ ఎమ్మెల్యేపై ఈ తరహా ఆరోపణలు చేయడం గులాబీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఇప్పటికే రెండు మూడుసార్లు ఏదో ఒక కాంట్రవర్సీ వార్తలు వచ్చాయి.
తాజాగా ఆరిజన్ డైయిరీ సంస్థ సీఈవో బోడపాటి శైలజ ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. చిన్నయ్యకు అమ్మాయిలకు పిచ్చి ఎక్కువ అని.. బెల్లంపల్లిలో డైరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానంటూ తమ దగ్గర ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. డైరీ సంస్థ విస్తరణ కోసం చిన్నయ్య చెప్పినట్టే తాను విన్నానని.. హైదరాబాద్కు వెళ్ళిన ప్రతిసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాను ఆయనకు ఎన్నో సపర్యలు చేసినట్టు చెప్పారు. ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆమె మీడియా సమావేశంలో వెల్లడించడం గమనార్హం.
అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే చాలాసార్లు ఒత్తిడి చేస్తే.. చివరకు పంపా అని.. తమ కంపెనీకి చెందిన ఓ అమ్మాయిని కూడా పంపాలని ఎమ్మెల్యే తమపై ఒత్తిడి చేశారని.. ఇప్పుడు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టుగా ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోగా… తమపైనే ఆయన తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. శైలజ చెబుతున్నట్టుగా ఉన్న వాయిస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఎమ్మెల్యే చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని.. ఆయన నుంచి తనను కాపాడాలని కూడా ఆమె వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే తనను నమ్మించి డబ్బులు తీసుకుని.. ఇప్పుడు తమపై తప్పులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రెండు ఎకరాల స్థలం ఇస్తానని తమ దగ్గర నుంచి రు. 20 లక్షలు తీసుకున్నారని.. త్వరలోనే రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి ఇప్పుడు మోసం చేసినట్టు శైలజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎవరో ఒక అమ్మాయిని తన దగ్గరకు పంపాలని ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి చేయడంతో కొందరు బ్రోకర్ల ద్వారా కూడా ఎమ్మెల్యే దగ్గరకు అమ్మాయిలను పంపామని.. దళిత బంధు గురించి మాట్లాడాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్కు పంపి.. అక్కడ తనతో మద్యం తాగించాలని బలవంతం చేసినా.. తనకు అలవాటు లేదని వచ్చేశానని.. ఎమ్మెల్యే తనను చాలా రకాలుగా వాడుకున్నారని కూడా ఆమె ఆరోపించారు.
మళ్లీ బెల్లంపల్లికి పిలిపించుకున్న ఎమ్మెల్యే పోలీసులను పిలిచి అక్రమంగా మూడు రోజుల పాటు నిర్భంధించడంతో పాటు స్టేషన్లో టార్చర్ చూపించారని కూడా ఆమె చెప్పారు. ఇప్పుడు 20 రోజుల తర్వాత కండీషన్ బెయిల్పై బయటకు వచ్చామని.. ఇలా చాలా ఆరోపణలు చేశారు. మరి అసలు ఈ ఇష్యూలో ఎమ్మెల్యే పాత్ర ఏంటన్నది ఆయన క్లారిటీ ఇస్తారా ? అన్నది చూడాలి. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.