అవును.. పడ్డచోట నుంచే వెలుగు ప్రస్థానాలకు టీడీపీ ప్రయాణించేలా చంద్రబాబు వేసిన వ్యూహం అదిరిపోయింది. ఇంకేముంది.. తెలంగాణలో అయిపోయింది.. ఏపీలోనూ తుడిచి పెట్టుకుపోయింది.. అంటూ.. టీడీపీపై సరిగ్గా ఏడాది కిందట అనేక కామెంట్లు ఇరు రాష్ట్రాల్లోనూ వినిపించాయి… సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీలో పెనుకుదుపు ఏర్పడింది.
ఇది అందరినీ ఆలోచనలకు కూడా గురి చేసింది. అయితే.. సరిగ్గా ఏడాది కాలంలో పార్టీని గాడిలో పెట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ.. రెండురాష్ట్రాల్లోనూ ఇప్పుడు మరోసారి పుంజుకుని.. నవనవోన్మేషంతో ముందుకు సాగేలా ఆయన వేసిన వ్యూహ రచన తమ్ముళ్లు తలెత్తుకుని తిరిగేలా.. పార్టీ జెండా రెపరెపలాడేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సరిగ్గా 8 నెలల కిందట ఖమ్మంలో పెట్టిన సభ సూపర్ హిట్ సాధించింది. ఇక, వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. దీనికి ముందు.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ పార్టీని వీడి కేసీఆర్ చెంతకు చేరినప్పుడు.. ఇంక లేదు.. అయిపోయిందనే టాక్ వినిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్కు పగ్గాలు అందించడంతో పార్టీ పుంజుకుంది.
నలుదిశలా.. పార్టీనిచైతన్య వంతం చేసేలా.. కాసాని కాలికి పనిచెప్పి.. మండలాల్లో పర్యటించారు. ఫలితంగా.. టీడీపీ ఆవిర్భావ సభలో పసుపు రెపరెపలు పరిఢవిల్లాయి. అదేసమయంలో అధికార బీఆర్ ఎస్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడడాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన పార్టీ కారణంగా.. ఇప్పుడు టీడీపీని విమర్శించే పరిస్తితి లేకుండా పోయింది.
దీనిని అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు తన సత్తా చాటుతున్నారు.ఇక, ఏపీలోనూ ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకుని చేసిన.. బాదుడే బాదుడు కావొచ్చు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కావొచ్చు.. ఏదైనా కూడా ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ రెండు కూడా.. ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తంగా చూస్తే.. తమ్ముళ్లు తలెత్తుకునేలా.. పడ్డచోట నుంచి పరుగులు పెట్టేలా పార్టీ ని ముందుకు నడిపించడంలో చంద్రబాబు పూర్తిగా సక్సెస్ సాధించారని చెప్పడంలో సందేహం లేదు.