ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రసవతరంగా మారాయి. అధికార వైసిపి ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలు వైసిపి ఖాతాలో పడాలంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు చేజారకూడదు. అలాగే అందరూ చెల్లుబాటు అయ్యేలా ఓట్లు వేయాలి. అయితే ఇప్పటికే పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి.
ఇక టీడిపి రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు, జనసేన రెబల్ ఎమ్మెల్యే ఒకరు తమకు ఓటు వేస్తారని వైసీపీ భావిస్తుంది. ఓవరాల్ గా ఒకటి రెండు ఓట్లు తారుమారు అయితే ఫలితం కూడా తారుమారు కానుంది. ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికలంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఈ లెక్కన వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆ పార్టీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి, ఆనం ఓట్లు తమకు పడవు అని వైసిపి లెక్కలు వేసుకుంటుంది. ఈ లెక్కన వైసీపీ సంఖ్యాబలం 149. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేల బలం కలిపితే 154 కు చేరుకుంది.
టీడిపికి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి రెండు ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటుంది. ఈ లెక్కన టీడిపికి 21 ఓట్లు పడతాయి. మరో ఓటు పడితే చాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధిస్తారు. అయితే ఇక్కడే సంచలన ఫలితం చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. పార్టీలో ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ వస్తుందో లేదో ? అన్న అనుమానంతో పార్టీకి దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు కొందరు వైసిపి ఎమ్మెల్యేలు.
ఇలాంటివారు ఎనిమిది మంది ఉన్నారని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. వీరిపై పెద్ద నిఘాను పెట్టారని.. ఇంటిలిజెంట్ వర్గాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వీరిలో ఏ ఒక్కరు టీడిపికి ఓటు వేసినా కచ్చితంగా సంచలన ఫలితం నమోదు అయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో ఈరోజు సాయంత్రం తేలిపోనుంది.