స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక్క సినీ కెరియర్ లోనే కాదు రాజకీయ జీవితంలో కూడా ఎన్నో రికార్డులను ఆయన తిరగరాశారు. 1923 మే 28న నిమ్మకూరులో జన్మించిన ఈయన.. 1996 జనవరి 18న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన సినీ రాజకీయ జీవితంలో చెరిగిపోని రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం.
సినీ ఇండస్ట్రీలోకి రాకముందు కుటుంబాన్ని పోషించడానికి 1940లో విజయవాడలో ఉన్న హోటల్ లకు ఎన్టీఆర్ పాలు పోసి కుటుంబాన్ని పోషించారట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వయసులో ప్రముఖ కూచిపూడి డాన్సర్ అయిన వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే అభిమానుల కోసం ఆయన ఏకంగా 17సార్లు కృష్ణుడి వేషం కట్టి ప్రేక్షకులను అలరించారు.
అంతేకాదు ఆయన నటించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలోని ఒక సన్నివేశాన్ని కట్ చేయాలని సెన్సార్ బోర్డు వాళ్ళు ఎంత పట్టుబడినా సరే కుదరదు అని దాదాపు మూడు సంవత్సరాలు పాటు పోరాటం చేసి కేసు గెలిచి మరీ ఆ సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. 90 రోజుల వ్యవధిలో 35 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ముఖ్య మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండడంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో పూజారి వృత్తికి ఎవరైనా సరే అర్హులు అంటూ పరీక్ష విధానాన్ని అమలు చేసిన ఘనత కూడా ఈయనదే. అంతేకాదు 1987 హర్యానా ఎన్నికలలో దేవీలాల్ కి సంబంధించిన మద్దతుగా ప్రచారం చేయడానికి తన తనయుడు నందమూరి హరికృష్ణ తోడుగా తీసుకొని హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో వెల్లగా అక్కడ దేవిలాల్ ఆ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.