కేంద్ర మాజీ మంత్రి బిజెపి జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందరేశ్వరి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆమె వచ్చే ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేస్తారా ? లేదా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. వాస్తవానికి 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలిచిన పురందేశ్వరి.. 2014 ఎన్నికలలో విశాఖ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన దెబ్బతో 2014లో బిజెపిలోకి వెళ్లిన ఆమె.. రాజంపేట ఎంపీగా ఓడిపోగా గత ఎన్నికలలో బిజెపి తరఫున విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
వచ్చే ఎన్నికలలో ఆమె బిజెపి నుంచి పోటీ చేసేందుకు.. అది కూడా విశాఖబరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత పదిఏళ్ళుగా బిజెపిలో ఉండడంతో ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆమె ఎన్నో ఆశలతో ఉన్నా… కేంద్రంలోని బిజెపి నాయకత్వం మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. తాజాగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖ ప్రజలు బిజెపిని పూర్తిగా పక్కన పెట్టేశారు.
పైగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మంచి వ్యక్తి మాధవ్ ఘోరంగా ఓడిపోయారు. కనీసం ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇతర జిల్లాల సంగతి ఎలా ? ఉన్నా పార్టీకి కాస్త పట్టు ఉన్న విశాఖలోనే ఇంత దారుణ పరిస్థితి కనిపించడంతో బిజెపి నేతలు వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు భయపడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, విశాఖ మెట్రో, విశాఖ రైల్వేజోన్ విషయంలో బిజెపి మోసం చేసింది అన్న భావన ఇక్కడ ప్రజల్లో బలంగా నాటుకు పోయింది.
ఇక జనసేన – బిజెపి పొత్తు కూడా ఉండే అవకాశాలు లేవు. ఒకవేళ రేపటి ఎన్నికలలో టీడిపి, బీజేపీ పొత్తు కుదిరితే టీడిపి ఈ సీటు వదులుకునేందుకు ఇష్టపడదు. ఈ క్రమంలోనే బిజెపి నుంచి ఒంటరిగా పోటీ చేస్తే పురందరేశ్వరి ఘోరంగా ఓడిపోవడంతో పాటు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. అందుకే ఆమె బిజెపికి దండం పెట్టేసి రాజకీయంగా సైలెంట్ అయిపోవటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె పార్టీ కార్యకర్తలలో ఏమాత్రం యాక్టివ్ గా లేరని… అసలు బిజెపిలో ఉండేందుకు కూడా ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.