ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి క్రాస్ ఓటింగ్ భయంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటుంది. వాస్తవంగా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ మహిళ ఆయిన విజయవాడకు చెందిన పంచమర్తి అనురాధను పోటీపెట్టారు.
దీనికి తోడు వైసీపీకి చెందిన ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేస్తామని చెప్పారు. ఈ రెండు ఓట్లపై వైసీపీకి నమ్మకం లేకుండా పోయింది. ఒక్క వైసిపి ఎమ్మెల్యే నుంచి క్రాస్ ఓటు పడినా పంచమర్తి అనురాధ గెలిచే ఛాన్స్ ఉంది. దీంతో వైసిపి నేతల్లో టెన్షన్ అయితే మామూలుగా లేదు. టీడిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రెబల్స్ గా మారి వైసిపి చెంత చేరిపోయారు.
అటు జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కూడా వైసిపి చెంత చేరారు. ఈ ఐదు ఓట్లు ఉన్నా కూడా.. వైసిపి నుంచి టీడిపికి అనుకూలంగా ఒక్క ఎమ్మెల్యే ఓటు వేసినా వైసిపి నుంచి పోటీపడుతున్న ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఒకరు ఓడిపోక తప్పదు. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో ఉన్న వైసీపీని మరో వార్త కలవర పెట్టేదిగా కనిపిస్తోంది.
వైసిపి క్యాంపులో ఉన్న మద్దాలి గిరిధర్ రావు, వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని బయటకు వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి అధిష్టానంతో టచ్లోకి రాలేదని.. తెలుగుదేశం మీడియా వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. వీరిలో మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ ఇద్దరు కూడా టీడిపి నుంచి గెలిచి వైసిపి లోకి వెళ్లిన వారే. ఇక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఇప్పటికే సీటు లేదన్న విషయం క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వసంత కృష్ణ ప్రసాద్ కూడా ముందు నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసంతృప్తితోనే ఉన్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితాలు వచ్చేంతవరకు వైసిపి నేతలకు టెన్షన్ అయితే మామూలుగా లేదు.